భక్తి ప్రజలను విచిత్ర సంప్రదాయాలను విశ్వసించేలా చేస్తుంది. భారతదేశం వివిధ రకాల ఆలయాలకు నిలయం. వీటిలో కొన్నింటిలో విచిత్ర సంప్రదాయాలు కొనసాగుతుంటాయి. దేవుడికి ఒక ప్రత్యేక వస్తువులను సమర్పించే ఆలయాల జాబితా ఇక్కడ అందిస్తున్నాం.
కాలభైరవ ఆలయం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్ః సాధారణంగా ఆలయం లోపల, పరిసరాల్లో మద్యం సేవించడం నిషిద్ధం. ఇక్కడ మాత్రం కాదు. పూలు, కొబ్బరికాయలతో పాటుగా భక్తులు ఇక్కడ కొలువుదీరిన కాలభైరవుడికి ఒక సీసా మద్యం కూడా సమర్పిస్తారు. మద్యం విక్రయించేందుకు ఆలయం వెలుపల దుకాణాలు కూడా ఉన్నాయి.
బ్రహ్మ బాబా ఆలయం, జవున్పూర్, ఉత్తరప్రదేశ్ః ఘరివాలె బాబా ఆలయంలో పూజలు చేసేందుకు భక్తులు గోడ గడియారాలు తీసుకువస్తుంటారు. గడియారం సమర్పించిన భక్తులకు వారు కోరుకున్నది జరుగుతుందని విశ్వాసం. ప్రతి రోజూ 80-100 గడియారాలను ఈ ఆలయంలో భక్తులు సమర్పిస్తుంటారు.
షాహీద్ బాబా నిహాల్ సింగ్ గురుద్వారా, జలంధర్, పంజాబ్ః విదేశాలకు వెళ్ళాలనే కోరికతో వందలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి విమానాలు సమర్పిస్తుంటారు. ఇది హవాయి జహాజ్ గురుద్వారాగా కూడా పేరొందింది.
నాగరాజ ఆలయం, మన్నారసాల, కేరళః సంతానం కలగాలనుకునే మహిళలు ఈ ఆలయాన్ని సందర్శించి తమ కోరిక తీరాలని కోరుకుంటారు. తమ కోరిక నెరవేరితే వారు తిరిగి ఈ ఆలయాన్ని సందర్శించి దైవాన్ని సంతృప్తి పరిచేందుకు నాగ ప్రతిమ సమర్పిస్తుంటారు.
బాలాజీ మందిరం, మెహిందిపూర్, రాజస్థాన్ః దయ్యం పట్టిన వారికి ఇక్కడ వాటి నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. దైవానికి సమర్పించేందుకు భక్తులు ఒక తాళం తీసుకువస్తుంటారు. ఆ దయ్యాలు ఈ తాళాల్లో బంధింపబడుతాయని విశ్వసిస్తారు. ఆలయం వెలుపల వాటిని వేలాడదీస్తారు.
కర్ని మాత ఆలయం, దేశ్నోక్, రాజస్థాన్ః అత్యధిక సంఖ్యలో ఉండే ఎలుకలకు ఈ ఆలయం పేరొందింది. తమ కోరికలు నెరవేరిన వారు వెండితో చేసిన ఎలుకను సమర్పించాలని విశ్వసిస్తుంటారు. ఇక్కడి పవిత్ర ఎలుకల్లో ఏదైనా మరణిస్తే, బంగారు విగ్రహంతో దాని లోటును భర్తీ చేస్తారు.